డ్రోన్‌ సర్వే ఒప్పందంలో మార్పులు

ABN , First Publish Date - 2022-05-14T09:26:31+05:30 IST

డ్రోన్‌ సర్వే ఒప్పందంలో మార్పులు

డ్రోన్‌ సర్వే ఒప్పందంలో మార్పులు

సర్వే ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ప్రైవేటు సర్వేతో న్యాయచిక్కుల భయంవల్లే..

22.5కోట్ల ఖర్చుపై యూసీలు ఇవాలన్న సర్కారు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో భూముల రీ సర్వేలో కీలకమైన ఒప్పందం మారనుంది. డ్రోన్‌ సర్వే కోసం సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ)తో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడాది నిర్విరామ ప్రయత్నాల తర్వాత ఒప్పందాన్ని మార్చుకునేందుకు ఎస్‌ఓఐ అంగీకరించినట్లు తెలిసింది. అయితే, మారే ఒప్పందంలో ఏయే అంశాలు ఉండాలి, ఇప్పుడున్న ఒప్పందంలో నుంచి ఏయే అంశాలను తొలగించాలన్నదానిపై ఇటు సర్వేశాఖ, అటు ఎస్‌ఓఐ.. అధికారులతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 17,460 గ్రామాల్లో భూముల సర్వేచేయడంతోపాటు, అందుకు అవసరమైన అన్ని రకాల పనులు చేసేందుకు 2020 డిసెంబరు 9న సర్వే ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వమిత్వ ప్రాజెక్టుపై దృష్టిపెట్టి.. ఈ ప్రాజెక్టుపై తగిన శ్రద్ధచూపడం లేదు. ఫలితంగా రీ సర్వేలో కీలక మైన డ్రోన్‌ సర్వే ఏమాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో డ్రోన్‌ సర్వేలో ఆ సంస్థకు కేవలం 40వేల చదరపు కిలోమీటర్లు కేటాయించి, మిగిలిన 80వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రైవేటు ఆపరేటర్లతో చేయించేందుకు టెండర్లు పిలిచి సంస్థలను ఎంపిక  చేశారు. ఎస్‌ఓఐతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగా ప్రైవేటు సర్వేపై న్యాయచిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐకి ఇచ్చిన 40వేల చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్‌సర్వే, ఇతర సర్వీసుల విషయంలో డ్రోన్‌ సర్వేచేసి ఇచ్చేలా ఒప్పందాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేంద్ర సంస్థ కూడా అంగీకరించింది. 


2149 గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తి

రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే కీలక దశకు చేరుకుందని రెవెన్యూశాఖ సర్కారుకు నివేదించింది. 2149గ్రామాల్లో ఇప్పటి వరకు డ్రోన్‌సర్వేను పూర్తిచేసినట్లు వెల్లడించింది. శుక్రవారం సచివాలయంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘానికి రెవెన్యూశాఖ నివేదిక ఇచ్చింది. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి  బొత్ససత్యనారాయణ, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. రీ సర్వేపై భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సాయిప్రసాద్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 52 డ్రోన్‌లతో సర్వే జరుగుతోందని, త్వరలో సర్వే ఆఫ్‌ ఇండియా, ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల నుంచి 172 డ్రోన్‌లు సమకూర్చుబోతున్నట్లు నివేదించారు. 756 గ్రామాలకు గ్రౌండ్‌ ట్రూతింగ్‌, 535 గ్రామాల్లో గ్రౌండ్‌ వాలిడేషన్‌ పూర్తిచేసినట్లు అధికారులు నివేదించారు. వచ్చే ఆగస్టు నాటికి అన్ని జిల్లాల పరిధిలోనూ డ్రోన్‌సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు.

Read more