కొత్తవలస ఓట్ల లెక్కింపుపై విచారణ జరపాలి
ABN , First Publish Date - 2021-02-26T08:42:19+05:30 IST
విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు...
- ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. ఈ పంచాయతీ సర్పంచి పదవికి జరిగిన ఎన్నికల్లో బోని తిరుపతిరావు 268 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని, కాని ఎన్నికల అధికారి అక్రమంగా వైసీపీ మద్దతిచ్చిన మచ్చా ఎర్రి రామస్వామి గెలిచినట్లు ప్రకటించారని పేర్కొన్నారు. పంతొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి తిరుపతిరావుకు 154 ఓట్ల మెజారిటీ ఉందని, చివరగా జరిగిన ఇరవయ్యో రౌండ్ లెక్కింపులో ఆయనకు మరో 114 ఓట్ల మెజారిటీ లభించిందని చంద్రబాబు వివరించారు. అయినా ఎన్నికల అధికారి మాత్రం రామస్వామి గెలిచినట్లు ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని హతమార్చారని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి తప్పు చేసిన అధికారిపై చర్య తీసుకోవాలని, అక్కడి లెక్కింపునకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు... వీడియో రికార్డింగ్ భద్రపర్చాలని కోరారు.