నన్ను కాదు... ప్రజల్ని మెప్పించండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-16T16:48:49+05:30 IST

‘నన్ను మెప్పించడానికి..

నన్ను కాదు... ప్రజల్ని మెప్పించండి: చంద్రబాబు

సత్యవేడు(చిత్తూరు): ‘నన్ను మెప్పించడానికి పని చేయొద్దు. ప్రజల కోసం పనిచేయండి.. ప్రజల వైపునుంచి పోరాడండి. అప్పుడే గుర్తింపు వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా నేనే మిమ్మల్ని వెతుక్కుని వచ్చి సన్మానిస్తా’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హితోపదేశం చేశారు. సత్యవేడులోని వీఎంకే కళ్యాణ మండపంలో గురువారం ఉదయం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ వాళ్లు  టీడీపీలో చీకటి నింపాలని చూస్తున్నారు. కానీ వెలుగు సృష్టించే శక్తి టీడీపీకే ఉందన్నారు. సత్యవేడులో నిర్వహించిన ప్రచార సభ సక్సెస్‌ చేసినందుకు అభినందనలు తెలిపారు.


కుప్పం తరువాత సత్యవేడులో పార్టీకి అంకితభావంతో పనిచేసే సమర్థులైన నాయకులు, కార్యకర్తలున్నారని గుర్తు చేశారు. భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా కృషి చేస్తే తిరుగుఉండదన్నారు. చిత్తశుద్ధితో పనిచేసిన వారికే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరుగుతోందని, వారికి అండగా ఉంటూ పార్టీపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేసి తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకోవాలని కోరారు. ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, జగదీశ్వరరావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌, హేమలత, టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్‌,  శ్రీనాథరెడ్డి, పర్వీన్‌తాజ్‌, గొర్రెల శ్రీధర్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-16T16:48:49+05:30 IST