స్వీయ నియంత్రణ వల్లే కరోనాను కట్టడి చేయొచ్చు: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-03-31T22:53:06+05:30 IST
ప్రధాని పిలుపు మేరకు భౌతికదూరం పాటించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకు నేతలు అందుబాటులో ...
హైదరాబాద్: ప్రధాని పిలుపు మేరకు భౌతికదూరం పాటించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకు నేతలు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. మొదటి సారి జూమ్ యాప్ ద్వారా తాను లైవ్లోకి వచ్చినట్లు చెప్పారు. లాక్డౌన్పై ప్రజలకు నేతలు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని దేశాలను కరోనా ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. స్వీయ నియంత్రణ వల్లే కరోనాను కట్టడి చేయొచ్చని చెప్పారు. కరోనా వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేశామన్నారు. ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని.. వేడినీళ్లతో ఆవిరి పట్టుకోవాలని.. నీళ్లు ఎక్కువగా తాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘ఇంట్లో వండుకున్న ఆహారాన్నే తినాలి.. రాత్రి 8 గంటలలోపే తినాలి. సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి. చైనా, అమెరికా, సింగపూర్ వంటి పెద్ద దేశాలే కరోనాను కట్టడి చేయలేకపోయాయి. చైనాలోని వూహాన్లో 62 రోజులు లాక్డౌన్ పాటించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుంది.’’ అని చంద్రబాబు తెలిపారు.