రెండు రోజులూ బస్సులోనే చంద్రబాబు బస

ABN , First Publish Date - 2021-10-31T02:18:24+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌసులో బస చేశారు.

రెండు రోజులూ బస్సులోనే చంద్రబాబు బస

కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌసులో బస చేశారు. ఆ సమయంలో తెల్లవారుజామున రెండుసార్లు గెస్టు హౌసులో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఈ కారణంగా తాజా పర్యటనలో చంద్రబాబు రెండు రోజులూ గెస్టు హౌసు ఆవరణలో ఏర్పాటుచేసిన బస్సులోనే బస చేశారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌసు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బస్సులో బస చేసిన చంద్రబాబు.. శనివారం ఉదయం కుప్పం టౌన్‌, రూరల్‌ సీఐలు సాదిక్‌అలీ, యతీంద్రలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కుప్పంలో చంద్రబాబు పర్యటించిన రెండు రోజులూ స్థానిక ప్రజలు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లానుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచీ నాయకులు చంద్రబాబును కలిశారు. ఆయన పర్యటనలో పాల్గొన్నారు. 


తొలిరోజు శుక్రవారం కుప్పం బస్టాండు వద్ద నిర్వహించిన బహిరంగ సభకు పెద్దఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడూ ఈ స్థాయిలో స్పందన చూడలేదని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. రెండో రోజు శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించగా.. అన్నిచోట్లా స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తొలిరోజు అర్ధరాత్రి 12.30 గంటల వరకు కుప్పం వీధుల్లో పర్యటించిన చంద్రబాబు రెండో రోజూ అదే జోష్‌ను కొనసాగించారు. సుమారు వంద వాహనాలతో ఆయన కాన్వాయ్‌ ముందుకు సాగింది. తొలి రోజు పోలీసుల భద్రత సరిగా లేదని చంద్రబాబు చెప్పడంతో శనివారం వందమందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటుచేశారు.

Updated Date - 2021-10-31T02:18:24+05:30 IST