ఏపీలో రహదారులన్నీ Ongole మహానాడు వైపే
ABN , First Publish Date - 2022-05-26T23:13:45+05:30 IST
ఏపీలో రహదారులన్నీ ఒంగోలు మహానాడు వైపే వెళ్తున్నాయి. విజయవాడ-ఒంగోలు జాతీయ రహదారి పసుపుమయంగా మారింది.
అమరావతి: ఏపీలో రహదారులన్నీ ఒంగోలు మహానాడు వైపే వెళ్తున్నాయి. విజయవాడ-ఒంగోలు జాతీయ రహదారి పసుపుమయంగా మారింది. మహానాడుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ప్రకాశం జిల్లా బోలపల్లి టోల్గేట్ దగ్గర అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నాయి. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చంద్రబాబు ర్యాలీ ఆలస్యమవుతోంది.
మరోవైపు మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 27, 28 తేదీల్లో ఒంగోలు వేదికగా మహానాడు జరగనుండగా నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ప్రాంగణం ఏర్పాటు చేసిన విషయం విదితమే. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి కూడా కావడంతో మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడు సమీపిస్తుండటంతో ఒంగోలులో పసుపు పండగ వాతావరణం నెలకొంది. నగరాన్ని పసుపుమయం చేసే ప్రయత్నాల్లో స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లతోపాటు పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలను తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో అలంకరించారు. మహానాడు జరిగే ప్రాంగణం సమీప ప్రాంతాలన్నింటినీ హోర్డింగ్లతో నింపేశారు.