ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు కానీ.. : చంద్రబాబు
ABN , First Publish Date - 2020-08-07T23:19:33+05:30 IST
టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏపీలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్లైన్లో మీడియాతో మాట్లాడారు.
అమరావతి : టీడీపీ హయాంలో హైదరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏపీలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్లైన్లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ తర్వాత నగరానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. అవన్నీ రావడం వల్లే హైదరాబాద్ నుంచి అధిక ఆదాయం వస్తోందన్నారు.
కులం చూసి నేను అభివృద్ధి చేశానా..?
‘ హైదరాబాద్లో నేను వేసిన విత్తనమే హైటెక్ సిటీ. ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు. కానీ హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్లో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆ రోజు హైదరాబాద్లో నా బంధువులు లేరు.. నా కులం లేదు. ఇప్పడు హైదరాబాద్ తెలంగాణకు ఆయువు పట్టుగా మారింది. దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీయే. ప్రపంచమంతా తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కులం చూసి నేను హైదరాబాద్ను అభివృద్ధి చేశానా..?. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ప్రాజెక్టు అమరావతి. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుంది..?. విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. విశాఖలో గంగవరం పోర్టును నేనే తీసుకొచ్చా. విశాఖను ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్గా తీర్చిదిద్దాం. మా హయాంలో రాయలసీమకు నీళ్లు వచ్చేలా అన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానికి ఎంపిక చేశాం. అమరావతికి ప్రఖ్యాత యూనివర్శిటీలు వచ్చేలా చేశాం. టీడీపీ హయాంలో 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించాం. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి. గుజరాత్లో 20 లక్షల జనాభాతో ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు ’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.