డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-11-06T21:37:19+05:30 IST

విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి: విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘‘విశాఖపట్నం జిల్లా ప్రశాంతతకు మారుపేరు. కానీ, నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అక్రమ భూకబ్జాలు, హత్యలతో క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయింది. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న బంగార్రాజు దారుణ హత్యకు గురయ్యారు. ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైంది. బంగార్రాజు మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనప్పటికీ ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడం విచారకరం. బంగార్రాజు భార్య నందిని కనీసం ఓదార్చలేని స్థితిలో ఉంది. బంగార్రాజు ముగ్గురు పిల్లలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం విశాఖపట్నం శాంతిభద్రతల సమస్య మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి హత్య కేసు నమోదు చేయాలి. నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి’’ అని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-06T21:37:19+05:30 IST