రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే
ABN , First Publish Date - 2021-08-29T15:12:01+05:30 IST
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన..
ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
వేమూరు: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డులో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో విద్యుత్ చార్జీలు పెంపుపై ఆందోళన చేస్తే వారిపై కాల్పులు జరిపించి గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీదేనని ఎద్దేవా చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. నిరసన ర్యాలీల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని నాగార్జున హెచ్చరించారు. మాజీ మంత్రి ఆనంద్బాబు అభివృద్ధి, అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రశ్నించారు. అవినీతిపై మాట్లాడే అర్హత ఆనంద్బాబుకు లేదన్నారు. కేవలం పార్టీ ఉనికి కోసమే టీడీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపాలనలో టీడీపీ కనుమరుగవుతుందని అందుకోసమే లేని పోని ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని నక్కా ఆనంద్బాబు తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. ఇకనైనా అవాస్తవాలు మాని ప్రజా సంక్షేమం కోసం ప్రతి పక్షపార్టీగా సూచనలు ఇస్తే బాగుంటుందని నాగార్జున ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఏడుకొండలు, పార్టీ నాయకులు కుర్రా లక్ష్మీనారాయణ, గాదె శివరామకృష్ణారెడ్డి, చందోలు డేవిడ్ విజయ్కుమార్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్, విష్ణుమొలకల వెంకటరెడ్డియ్య, పిచ్చయ్యశాస్త్రీ, సనక వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.