చరిత్ర హీనుడిగా జగన్.. ఈ విజయం 5 కోట్ల మంది ప్రజలది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-03T23:32:46+05:30 IST

ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై..

చరిత్ర హీనుడిగా జగన్.. ఈ విజయం 5 కోట్ల మంది ప్రజలది: చంద్రబాబు

అమరావతి: ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై కోర్టును తీర్పును ఆయన స్వాగతించారు. రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడని, రాజధాని ఇక్కడే అన్నారని, 3 క్యాపిటల్ అని ఇప్పుడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టాడని చంద్రబాబు గుర్తు చేశారు. పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవని ఎద్దేవా చేశారు. రాజధానిలో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారని, కృష్ణానది పక్కన ఉండే భూమిని శ్మశానం అన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారని పక్కగా సీఆర్డీఏ చట్టం చేశామని చెప్పారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 



‘‘మహిళా రైతులు వీరోచితంగా పోరాడారు. పాదయాత్రకు వెళ్ళిన రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అంతా చూశాం. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అమరావతి పోరాటం చాటింది. తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారు. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన విజయం 5 కోట్ల తెలుగు ప్రజలది. రాజధాని ఉద్యమ రైతులకు, ప్రజలకు అభినందనలు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారు. నాకు ఏ కులం లేదు...పేదలే నా కులం.’’ అని చంద్రబాబు అన్నారు. 



Updated Date - 2022-03-03T23:32:46+05:30 IST