పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు?: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-06T19:34:40+05:30 IST
ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు.
అమరావతి: అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు ఏం చేప్పారు...ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్ది తుగ్లక్ పాలన కాక మరేమిటన్నారు. అధికారం ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్ పాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.