మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే..: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-02-19T19:41:03+05:30 IST

ప్రకాశం జిల్లా: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్‌లా వ్యవహరించి ఉంటే..

మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే..: చంద్రబాబు

ప్రకాశం జిల్లా: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్‌లా వ్యవహరించి ఉంటే.. వాళ్లు పాదయాత్రలు చేసేవాళ్లా? అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు తొలగించారని విమర్శించారు. కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తే రేషన్‌ కట్‌ చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులను వెనక్కి పంపించిందని ఆరోపించారు. బెదిరించి కియాను కూడా పంపించాలని చూస్తున్నారని అన్నారు.


అమరావతి, పోలవరం ప్రాజెక్టు మనకు రెండు కళ్లని చంద్రబాబు అన్నారు. అమరావతి అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. రైతులు, ఆడబిడ్డలు రోడ్డుపైకి వస్తే లాఠీఛార్జ్‌ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినట్లేనని అన్నారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం వాళ్లు ఉన్నారని ప్రచారం చేశారన్నారు. టీడీపీ సామాజిక న్యాయం కోసం కట్టుబడిన పార్టీ అని స్పష్టం చేశారు. ఈ పిచ్చి తుగ్లక్‌ జగన్ నన్ను విమర్శిస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని శ్మశానం, ఎడారి అని మాట్లాడుతున్నారని, మంత్రులంతా శ్మశానంలో పనిచేస్తున్నారా? అని బాబు ప్రశ్నించారు.

Updated Date - 2020-02-19T19:41:03+05:30 IST