కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలివి..

ABN , First Publish Date - 2020-07-04T04:29:05+05:30 IST

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రాథమిక విచారణ కూడా...

కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలివి..

అమరావతి: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రాథమిక విచారణ కూడా చేయకుండా అరెస్ట్‌ చేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనమని ఆయన విమర్శించారు.


దురుద్దేశపూర్వకంగా.. కావాలనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని, బీసీలంటేనే వైసీపీ పగబట్టిందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతీకారేచ్ఛతో చేస్తున్న అరెస్ట్‌లను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదని చెప్పారు. కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. 


అసలేం జరిగిందంటే...

మోకా భాస్కరరావు అనే వ్యక్తి మచిలీపట్నం 23వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన గత సోమవారం ఉదయం చేపల మార్కెట్‌కు వచ్చి, అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. అదే సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయనను ఆటోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంత్రి పేర్ని నానికి అత్యంత ఆప్తుడైన మోకా హత్యతో బందరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


ఈ హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. విశాఖ వైపు వెళుతున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తుని నుంచి విజయవాడకు పోలీసులు తరలించారు.

Updated Date - 2020-07-04T04:29:05+05:30 IST