అలా అయితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-21T19:47:15+05:30 IST

టీడీపీలో సీనియారిటీని గౌరవిస్తామని, సిన్సియారిటీని గుర్తిస్తామని చంద్రబాబు అన్నారు.

అలా అయితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుంది: చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గౌరవిస్తామని, సిన్సియారిటీని గుర్తిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సీనియారిటీ ఉన్నా.. ఓటు వేయించలేని పరిస్థితే ఉంటే ఏం లాభమన్నారు. ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యమివ్వాలని కోరితే.. టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందన్నారు. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. కొందరు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంకొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థ యువకులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పార్టీలో పని చేసే యువ నేతలనూ గుర్తిస్తామని, అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఓ పద్దతిగా చేపట్టడం టీడీపీ ఆనవాయితీ అని అన్నారు.


ఒక్క సెకండులోనే 8,700 మంది సభ్యత్వం కోసం అప్రోచ్ అయ్యారని చంద్రబాబు అన్నారు. చంపేసినా ఫర్వాలేదు.. జై జగన్ అనే నినాదం చేయనంటూ చంద్రయ్య అనే కార్యకర్త చనిపోయారని, చంద్రయ్యలాంటి కార్యకర్తలే టీడీపీకి బలమని అన్నారు. నిజమైన కార్యకర్తలకు సరైన గౌరవం లభించడం లేదనే బాధ కొందరిలో ఉందని, ఆ బాధను తప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శక్తిని బట్టి డొనేషన్లు ఇవ్వాలని, సమాజ హితం కోసం టీడీపీ అవసరం ఉందని, అందుకే డొనేషన్లు కొరుతున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఇచ్చే వాళ్లని, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వలేకపోతోందన్నారు. పార్టీకి డొనేషన్లు వస్తే.. సీఎం రిలీఫ్ ఫండ్ దక్కని వారిలో కొంత మందికైనా సాయం చేయొచ్చునని చెప్పారు. ఏపీకి గత మూడేళ్లల్లో భారీ డామేజ్ జరిగిందని, రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-21T19:47:15+05:30 IST