పేదల ఇళ్లలో... వైసీపీ అవినీతి పంట
ABN , First Publish Date - 2020-06-05T09:59:53+05:30 IST
‘‘ఇళ్ల నిర్మాణంలో మేం దేశానికి నమూనాగా నిలిస్తే... ఇప్పుడు వైసీపీ నేతలు అందులో అవినీతి పంట పండిస్తున్నారు. వసూళ్ల దందాకు తెరలేపారు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. గురువారం ఆయన ట్విటర్లో
- ఆవ భూముల్లోనే 400 కోట్ల కుంభకోణం : చంద్రబాబు
‘‘ఇళ్ల నిర్మాణంలో మేం దేశానికి నమూనాగా నిలిస్తే... ఇప్పుడు వైసీపీ నేతలు అందులో అవినీతి పంట పండిస్తున్నారు. వసూళ్ల దందాకు తెరలేపారు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. గురువారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘పేదల కోసం టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. అందులో 9.10 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 8 లక్షల గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. వాటిని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు’’ అని ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల కల్పనను పెద్ద కుంభకోణంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘భూములను అధిక ధరకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల్లోనే 400 కోట్ల కుంభకోణం చేశారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది’’ అని చెప్పారు. కాగా, ‘‘అమెరికా ప్రజలు తిరగబడడంతో ట్రంప్ బంకర్లో దాక్కున్నారు. వైసీపీ అక్రమాలు, అరాచకాలకు రాష్ట్ర ప్రజలు తిరగబడితే జగన్ ఎక్కడ దాక్కుంటారు?’’ అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. జగన్ ఏడాది పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని మీడియాకు చెప్పారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏడాది పాలనలో వైసీపీ ఖజానా ఖాళీ చేసి, ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నాం చేశారని విమర్శించారు. టీడీపీ పాలనలో ఏడాదికి 24వేల కోట్లు అప్పు తేగా, జగన్ ఏడాదిలోనే 80వేల కోట్లు అప్పు చేశారన్నారు. వాహన మిత్ర పథకాన్ని వాహనాలు అద్దెకు తీసుకుని నడుపుకొనే వారికీ వర్తింపజేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు డిమాండ్ చేశారు.