ఉత్సాహంగా చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-03-06T07:32:04+05:30 IST
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టి న రోడ్ షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
నగరానికి వచ్చినప్పటి నుంచి బిజీబిజీ..
పార్టీ నాయకులతో సమావేశం
విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి) : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టి న రోడ్ షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. విజయవాడ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు నగరానికి చేరుకున్న చంద్రబాబు.. హోటల్ మారియట్లో నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన పీలా శ్రీనివాసరావు ఇంటికి పెందుర్తి వెళ్లారు. అక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్న పీలా కుమార్తె, అల్లుడిని చంద్రబాబు ఆశీర్వదించారు. పల్లా కుటుంబ సభ్యుల్లో చిన్నారికి చంద్రబాబు అక్షరాభ్యాసం చేయించారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్డు షో.. పెందుర్తి, చినముషిడివాడ, గోపాలపట్నం, ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా వచ్చి.. అక్కయ్యపాలెంలో ముగిసింది. దారి పొడవునా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట పదుల సంఖ్యలో యువత బైక్లతో అనుసరించారు.
నేటి పర్యటన వివరాలు..
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం రోడ్ షోలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి పాత గాజువాక జంక్షన్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ నుంచి కొత్త గాజువాక, జింక్ గేట్, శ్రీహరిపురం, మల్కాపురం, సింథియా, కాన్వెంట్ జంక్షన్, మనోరమ మీదుగా రోడ్ షోగా వెళ్లి.. దుర్గాలమ్మ గుడి వద్ద జరిగే సమావేశంలో పాల్గొంటారు. 12.45 గంటలు నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు టీడీపీ ఆఫీస్లో ఉంటారు. 4:30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్కు వెళ్లి అక్కడ సమావేశంలో మాట్లాడతారు. అనంతరం డాబాగార్డెన్స్, ఎల్ఐసీ బిల్డింగ్, ద్వారకానగర్ మీదుగా సాయంత్రం 5:30 గంటలకు సీతమ్మధారలో జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం గురుద్వార, సత్యం జంక్షన్, మద్దిలపాలెం మీదుగా వెళ్లి 6:15 గంటలకు ఇసుకతోట సమావేశంలో మాట్లాడతారు. వెంకోజీపాలెం, హనుమంతువాక, విమ్స్ ఆదర్శ్నగర్, ఎండాడ మీదుగా వెళ్లి పీఎం పాలెం స్టేడియంలో సాయంత్రం 8 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.