నాడు మయసభ అన్నారు

ABN , First Publish Date - 2020-04-10T07:54:29+05:30 IST

విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ మయ సభని.. అక్కడ ఏమీ లేదని విమర్శించిన నోటితోనే ఇప్పుడు అది దేశానికి గర్వకారణమని ప్రశంసించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...

నాడు మయసభ అన్నారు

  • నేడు అదే నోటితో మెచ్చుకుంటున్నారు
  • విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై జగన్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ మయ సభని.. అక్కడ ఏమీ లేదని విమర్శించిన నోటితోనే ఇప్పుడు అది దేశానికి గర్వకారణమని ప్రశంసించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైద్యులకు మాస్కులివ్వాలని అడిగినందుకు నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన గురువారం వేర్వేరు లేఖలు రాశారు. ‘మెడ్‌టెక్‌ జోన్‌ ప్రాధాన్యాన్ని జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం సంతోషం. గత ప్రభుత్వ దూరదృష్టి, ముందు చూపు ఆలోచనలు మెడ్‌టెక్‌ జోన్‌ పనితీరులో ప్రతిఫలిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభంలో 55 నిమషాల్లోనే కరోనా నిర్ధారణ చేసే టెస్టింగ్‌ కిట్ల తయారీకి ఈ జోన్‌ వేదిక కావడం శుభ పరిణామం. ఇప్పుడు రోజుకు రెండు వేల కిట్ల తయారీ సామర్థ్యం దానికి ఉంది.


ఈ నెలాఖరుకు రోజుకు పాతిక వేలకు.. మే నెలాఖరుకు ఏడున్నర లక్షలకు చేరుకోబోతుండడం ఈ కారు చీకట్లో కాంతి రేఖ. 3,000కి పైగా వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాలు కూడా ఇందులో యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తుండడం ముదావహం. ఈ పది నెలలూ దానిని నిర్లక్ష్యం చేయకుండా మరింత అభివృద్ధి చేసి ఉంటే ఇది దేశానికే మరింత మంచి సేవలు అందించేది. మరిన్ని కంపెనీలు ఈ మెడ్‌టెక్‌ జోన్‌కు వచ్చేవి. గత ప్రభుత్వంపై అక్కసుతో ఆరోపణలు, విచారణలతో ఏడాది కాలాన్ని వృధా చేశారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు. ఇదే స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, ఆర్టీజీ వ్యవస్థను కూడా వాడుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రెక్కాడితేగాని డొక్కాడని లక్షలాది మంది పేద కార్మికుల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలో వారికి ఎంతో ఉపయోగపడి ఉండేవని.. కేరళ, కర్ణాటక, హైదరాబాద్‌ వంటి చోట్ల ఈ తరహా క్యాంటీన్లు అందిస్తున్న ఫలితాలతోనైనా మన వద్ద కూడా వీటిని పునరుద్ధరించాలని కోరారు. కూలీల కొరత, రవాణా సౌకర్యాల స్తంభనతో ఆక్వా, పౌలీ్ట్ర, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పత్తి, మిర్చి, ఉల్లి, ధాన్యం తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన స్పందించి వారిని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.


లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, చేనేత, గీత, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వారికి కూడా తక్షణం రూ. ఐదు వేల సాయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం. విధ్వంసం చాలా సులభం. ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసాలకు స్వస్తి చెప్పండి’ అని పేర్కొన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కూడా జగన్‌ను చంద్రబాబు కోరారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో అవసరమైన పరికరాలు ఇవ్వడం ద్వారా వైద్యుల మనో ధైర్యం కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ‘ మాస్కులు, గ్లౌజులు అడిగిన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తూ అనంతపురంలో నలుగురు వైద్య సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో సుధాకర్‌ వ్యాఖ్యలను సానుకూలంగా చూడాలి తప్ప ప్రతికూల చర్యలు సరికాదు’ అని పేర్కొన్నారు.



Updated Date - 2020-04-10T07:54:29+05:30 IST