సీఎం జగన్ అలసత్వానికి ఇంకెందరు బలి కావాలి? చంద్రబాబు

ABN , First Publish Date - 2021-05-06T23:46:14+05:30 IST

ఓ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము కరోనాపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే తనపైనే ప్రభుత్వం ఎదురు దాడికి

సీఎం జగన్ అలసత్వానికి ఇంకెందరు బలి కావాలి? చంద్రబాబు

అమరావతి: ఓ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము కరోనాపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే తనపైనే ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని, వైసీపీ నేతలే రాజమండ్రిలో మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. కరోనా నియంత్రణపై సోషల్ మీడియాలో అభూత కల్పనలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ‘వ్యాక్సిన్ సరఫరా చేయండి... ప్రాణాలు కాపాడండి’ అన్న నినాదంతో ఈ నెల 8 న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రుల లాగా సీఎం జగన్ కూడా వ్యాక్సినేషన్‌కు వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. 


దేశంలో కోవిడ్ తీవ్రత ఉన్న 33 జిల్లాల జాబితాలో ఏపీకి చెందిన 7 జిల్లాలు ఏపీలో ఉన్నాయని కేంద్రం పేర్కొందని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టిలోకి తీసుకున్నారా? అని బాబు ప్రశ్నించారు. వ్యాక్సిన్ తప్ప, కరోనా నియంత్రణకు మరో మార్గమే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రన్న బీమా ఉండి ఉంటే మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున సహాయం వచ్చేదని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజారోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయం సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో గణనీయంగా కేసులు పెరుగుతున్నాయని, ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క పేషెంట్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అలసత్వానికి ఇంకెందరు బలికావాలని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-06T23:46:14+05:30 IST