HYD : ఎక్కడినుంచైనా ఫిర్యాదుకు చాన్స్.. అందుబాటులోకి ప్రత్యేక పోర్టల్
ABN , First Publish Date - 2021-10-26T16:30:38+05:30 IST
ఇలాంటి కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు....
హైదరాబాద్ సిటీ : న్యూడ్ కాల్ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రై కమిషనరేట్ పరిధిలో రోజుకు సుమారు పది మంది వరకు ఇలాంటి మోసగాళ్ల బారిన పడుతున్నారని సైబర్ క్రైబమ్ పోలీసులు అంటున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. పరువు పోతుందనే ఉద్దేశంతో సైబర్ నేరస్థులు అడిగినంత ఇస్తున్నారు. ఇలాంటి కేసులో బాధితులు దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే విధంగా కేంద్ర హోం శాఖ ప్రత్యేక ఎన్సీసీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైం రికార్డు పోర్టల్) పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
సైబర్క్రైమ్ డాట్ జీవోవీ.ఇన్లో లాగిన్ అయి ఫిర్యాదును నమోదు చేయవచ్చన్నారు. వివరాలను బట్టి ఫిర్యాదుదారుడు ఏ కమిషనరేట్ పరిధిలోకి చెందితే అక్కడి సైబర్క్రైం సెల్కు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులే బాధితుడు/బాధితురాలికి ఫోన్ చేస్తారు. టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించి కేసు దర్యాప్తు చేస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇష్టపడిని వారు, పరువుపోతుందని భావించేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాలు ఉంటే సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్క్రైమ్ విభాగాన్ని సంప్రదించొచ్చు.