-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » chamanti-NGTS-AndhraPradesh
-
చామంతి సాగు అదుర్స్!
ABN , First Publish Date - 2022-05-14T06:49:35+05:30 IST
ప్రకృతి అందాలకు నెలవైన అరకులోయ పూల సాగుకు అనువైన ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో చేపడుతున్న చామంతి పూల సాగు దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.
గద్యాగుడ జంక్షన్ వద్ద తెలుపు, పసుపు పూల సాగు
ఆశించిన దిగుబడి వస్తున్నదని రైతు వెల్లడి
అరకులోయ ప్రాంత వాతావరణం పూల సాగుకు ఎంతో అనుకూలం
అరకులోయ, మే 13: ప్రకృతి అందాలకు నెలవైన అరకులోయ పూల సాగుకు అనువైన ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో చేపడుతున్న చామంతి పూల సాగు దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. అరకులోయ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరాన ఉన్న గద్యాగుడ జంక్షన్ వద్ద ఒకటిన్నర ఎకరాల్లో తెలుపు, పసుపు రంగులతో కూడిన చామంతి పూల సాగును విశాఖపట్నానికి చెందిన కోరుకొండ నవీన్ చక్రవర్తి చేపట్టారు. బెంగళూరు నుంచి చామంతి పూల మొక్కల నారు తెచ్చి సాగు చేశారు. దీనికి బిందు సేద్యం ఎంతగానో దోహదపడింది. కోల్కతా రకానికి చెందిన చామంతులు బాగా దిగుబడి వస్తాయని పలువురు సూచించడంతో ఆ వెరైటీని వేశారు. వంద రోజులకు పంట చేతికందుతుంది. అధిక శాతం రెండు రకాల చామంతులు వేయగా, కొంత భాగం పలు రకాల బంతి పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లోని ఫ్లవర్ డెకరేటర్లకు అర్డర్పై సరఫరా చేస్తున్నారు. పూల కోత మొదలైననాటి నుంచి 60 రోజుల వరకు పూల దిగుబడి వస్తుందని చామంతులను సాగు చేస్తున్న రైతు నవీన్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చామంతులను రూ.160లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతం నేల పూలసాగుకు అనువైనదేనన్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉందని, మార్కెట్ సౌకర్యం ఉంటే ఆదాయం బాగా వస్తుందని తెలిపారు. మూడు రకాల(రెండు రకాల చామంతులు, బంతి) పూలసాగుకు ఇప్పటి వరకు రూ.5.5 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు. కాగా మన్య ప్రాంతం ఫ్లోరీకల్చర్కు అనువైనది అనడానికి ఈ చామంతుల సాగే నిదర్శనం. గిరిజన రైతులను ఐటీడీఏ ఫ్ల్లోరీకల్చర్ దిశగా ప్రోత్సహిస్తే మంచి ఫలితం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పట్టణాల్లో మార్కెట్ సౌకర్యంపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.