అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-29T09:49:15+05:30 IST

గుంటూరు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మార్కెట్లలో కూరగాయలను అధిక ధరలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

కమిషనర్‌ చల్లా అనురాధ


గుంటూరు (కార్పొరేషన్‌), మార్చి 27: గుంటూరు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మార్కెట్లలో కూరగాయలను అధిక ధరలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. శుక్రవారం కమిషనర్‌  పిచుకులగుంట, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌, ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌లను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన రేట్ల కంటే అధిక ధరలకు అమ్మితే ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను విక్రయిస్తారన్నారు.

అధికారులు, మార్కెట్‌ వ్యాపారులతో సమావేశం

అనంతరం నగరపాలక సంస్థలో కౌన్సిల్‌ హాలులో జీఎంసీ అధికారులు, మార్కెట్‌ వ్యాపారులతో కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఉల్ఫ్‌ హాలు వద్ద ప్రజలు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలోని మార్కెట్‌ను రేపటి నుంచి నిర్వహించబోమని తెలిపారు. దగ్గరలో ఉన్న స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. షాపులు ఏర్పాటుచేసేవారు విధిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని ఒక ప్రాంతంలో షాపు పెట్టేందుకు అనుమతి తీసుకొని వేరే ప్రాంతంలో షాపు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ భాగ్యలక్ష్మి, డీసీ-2 శ్రీనివాసరావు, ఆర్వోలు, పోలీస్‌ అధికారులు, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-29T09:49:15+05:30 IST