-
-
Home » Andhra Pradesh » Kurnool » Chakrapanireddy-MRGS-AndhraPradesh
-
రాజకీయాలకు Chakrapanireddy గుడ్బై చెప్పనున్నారా..? ఇదంత తనయుడి కోసమేనా..?
ABN , First Publish Date - 2022-05-12T17:51:32+05:30 IST
శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే ఇటీవలి మంత్రివర్గ
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రాజకీయాలకు గుడ్బై చెప్పేశారా? ఇదే విషయాన్ని ఆయన వైసీపీ హైకమాండ్కు స్పష్టంగా చెప్పేశారా? తన కుమారుడు కార్తీక్రెడ్డి పాలిటిక్స్లోకి వస్తాడు, అతనని ఆశీర్వదించి, మద్దతు ఇవ్వమని వైసీపీ పెద్దలను ఆయన కోరారా? అసలు శ్రీశైలం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
రాజీనామా చేసిన ఆత్మకూరు కౌన్సిలర్లు
శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో తనకూ చోటుటుందని ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. మరోసారి నంద్యాల జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికే అవకాశం దక్కింది. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఆత్మకూరు కు చెందిన కొంత మంది కౌన్సిలర్ లు రాజీనామా చేశారు. మంత్రి పదవి విషయంలో ఆశించినట్టు జరగకపోవడంతో చక్రపాణి రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు మౌనంగా ఉండిపోయారు. ఒకానొక దశలో ఆయన టీడీపీలోకి వెళతారనే పుకార్లు షికారు చేశాయి.
షాకింగ్ న్యూస్ చెప్పిన చక్రపాణిరెడ్డి
కానీ ఎట్టి పరిస్థితిలోనూ తాను టీడీపీలో చేరనని ఆయన తన సన్నిహితుల ద్వారా స్పష్టం చేయించారు. ఈ క్రమం లోనే చక్రపాణిరెడ్డి తన సన్నిహితులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారట. తాను ఇకపై రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారట. అనారోగ్య పరిస్థితుల వల్ల రాజకీయాలనుంచి తప్పుకుంటున్నాని చెప్పారుట. ఇకపై తన కుమారుడు కార్తీక్రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని, అతనని కూడా ఎంకరేజ్ చేయాలని కోరారుట. ఈ మధ్యకాలంలో కార్తీక్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన తండ్రి అనుచరులను, కార్యకర్తలను కలుసుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెపుతున్నారు. దీంతో శిల్పా చక్రపాణి రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ నిజమేనని తేలిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ హైకమాండ్ రాజకీయాల్లో కొనసాగాలని చక్రపాణి రెడ్డికి సూచించినా ఆయన ససేమిరా అన్నారుట. రాజకీయాలకు గుడ్బై చెప్పాలనేదే తన తుది నిర్ణయమని ఆయన వైసీపీ అధినాయకత్వానికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. తన కుమారునికి ఆశీస్సులు అందించమని వైసీపీ పెద్దలను కోరారట.
మొదటి, రెండో విడత మంత్రి వర్గంలోనూ నిరాశే
శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా అధ్యక్షునిగానూ, ఎమ్మెల్సీగానూ పని చేశారు. శాసనమండలి చైర్మన్ పదవిని కూడా చంద్రబాబు ఆఫర్ చేశారు. అదే సమయంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాలమరణతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో చక్రపాణి సోదరుడు శిల్పామోహనరెడ్డి నంద్యాల టీడీపీ టిక్కెట్ను ఆశించినా దక్కలేదు. దీంతో ఈ సోదరులిద్దరూ వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో మోహన్రెడ్డి ఓడిపోయాక రాజకీయాలకు దూరమయ్యారు. తరువాత 2019లో శ్రీశైలం నుంచి చక్రపాణిరెడ్డి గెలుపొందారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కానీ మొదటి , రెండో విడత మంత్రి వర్గంలోనూ ఆయనకు నిరాశే ఎదురైంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మొండిచేయి చూపడంతో ఆయన రాజకీయాలపై విరక్తి చెందినట్టు సమాచారం. తెలుగుదేశంలో మండలి చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని వదులుకుని జగన్ వెంట నడిస్తే చివరకు నిరాశే మిగిలిందని ఆయన ఆవేదనలో ఉన్నారుట. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్టు తెలిసింది. ఇక తన కుమారుడైనా రాజకీయాల్లో రాణించి తన ఆశ తీరుస్తారనే ఆలోచనలో ఉన్నారుట. మరి చక్రపాణిరెడ్డికి హ్యాండిచ్చిన జగన్ మరి కార్తీక్రెడ్డిని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో చూడాలి.