కనిగిరిలో కుర్చీ కుస్తీ
ABN , First Publish Date - 2021-10-27T07:27:43+05:30 IST
కనిగిరిలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వాఽధికారుల కుర్చీలాట నడుస్తోంది.
నగర పంచాయతీ కమిషనర్ బదిలీలో రాజకీయ జోక్యం
ప్రస్తుత కమిషనర్ వైపు ఓ వర్గం
బదిలీ చేయించాలని మరో వర్గం
కనిగిరి, అక్టోబరు 26: కనిగిరిలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వాఽధికారుల కుర్చీలాట నడుస్తోంది. నగర పంచాయతీల్లో ఇటీవల కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చింది. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డీటీవీ కృష్ణారావుకు ప్రమోషన్ లభించింది. కనిగిరి కమిషనర్గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. దీంతో రెండువారాల క్రితమే కనిగిరిలో బాధ్యతలు స్వీకరించేందుకు కృష్ణారావు వచ్చాడు. ఆయనకు ప్రస్తుత పాలకమండలి, స్థానిక శాసనసభ్యుడి నుంచి అభ్యంతరం ఎదురైనట్లు సమాచారం. దీంతో వెనుతిరిగి వెళ్లారు. తిరిగి మళ్లీ మంగళవారం విధుల్లో చేరేందుకు రావడంతో ఉత్కంఠ ఏర్పడింది.
బదిలీల్లో రాజకీయ జోక్యం
ప్రస్తుత కమిషనర్ నారాయణరావుకు తన విధులను సక్రమంగా నిర్వహించడమే కాకుండా ముక్కుసూటిగా పనిచేస్తూ నిబద్ధతతో ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉంది. పట్టణ పాలన గాడిలో పడిందంటే ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రజల్లో గుర్తింపు ఉంది. పార్టీలకతీతంగా నాయకులు ఆయన్ను గౌరవిస్తారు. అదే సమయంలో నగరంలో పారిశుధ్య మెరుగుకు ఆయన చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. అదేసమయంలో చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. దీనిని పాలకవర్గంలోని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని పట్టణంలో చర్చ మొదలైంది. పాలకమండలి ఏర్పడిన రోజు నుంచి కమిషనర్ను బదిలీ చేయించే పనిలో ఓ వర్గం ఉంది. గత చైర్మన్ వెంట ఉండి హవా నడిపిన వ్యక్తులు, ప్రస్తుత పాలకవర్గంలో పదవులు పొందిన వారు కమిషనర్ బదిలీలో పావులు కదిపినట్లు చర్చ నడుస్తోంది. ఈక్రమంలో పాలకవర్గంలోని ఓ గ్రూపు కమిషనర్ను బదిలీ చేయించాలని, మరోగ్రూపు కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నారాయణరావు కమిషనర్గా కొనసాగుతారా..? లేదా..? అన్నది వేచిచూడాల్సి ఉంది.