CET results: సీఈటీ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ABN , First Publish Date - 2022-07-31T17:18:00+05:30 IST
రాష్ట్రంలోని ఇంజనీరింగ్(Engineering) తదితర వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) ఫలితాలను శనివారం
- ర్యాంకుల్లో సత్తాచాటిన బాలురు
బెంగళూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్(Engineering) తదితర వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) ఫలితాలను శనివారం ప్రకటించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని కర్ణాటక పరీక్షా ప్రాధికార కార్యాలయంలో ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ(Minister Dr. CN Aswatthanarayana) ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు. జూన్ 16, 17 తేదీల్లో జరిగిన సీఈటీకి 2,10,829 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 1,71,656 మంది విద్యార్థులు పలు ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి అర్హత పొందారు. వ్యవసాయ కోర్సుల్లో 1,39,968 మంది విద్యార్థులు, పశువైద్య కోర్సుల్లో 1,42,820 మంది, యోగా, నేచురోపతి కోర్సుల్లో 1,42,750 మంది, డీ-ఫార్మ్, బీ-ఫార్మ్ కోర్సులలో 1,74,568 మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో 88,575 మంది విద్యార్థినులు అర్హత పొందగా 83,081మంది బాలురు అర్హత పొందారని మంత్రి వివరించారు. ర్యాంకుల్లో మాత్రం బాలురే పైచేయి సాధించడం విశేషం. కాగా ఆగస్టు 5 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.
ర్యాంకులు పొందిన విద్యార్థులు వీరే...
ఇంజనీరింగ్ విభాగంలో యలహంక నేషనల్ పబ్లిక్ స్కూల్కు చెందిన అపూర్వ టండన్ తొలిర్యాంకు(first rank)ను సాధించగా మారతహళ్లి చైతన్య టెక్నోస్కూల్కు చెందిన సిద్దార్థసింగ్ రెండోర్యాంకును, ఇదే పాఠశాలకు చెందిన ఆత్మకూరి వెంకటమాద మూడోర్యాంకును, విద్యారణ్యపుర నారాయణటెక్నో స్కూల్కు చెందిన ఆర్కే శిశిర్ నాల్గవర్యాంకును సాధించారు. చామరాజపేటలోని మహేశ్ పీయూ కళాశాలకు చెందిన విశాల్ బైసాని ఐదో ర్యాంకును సాధించగా ఇదే కాలేజికి చెందిన కేవీ సాగర్ ఆరో ర్యాంకును పొందారు. విద్యారణ్యపుర నారాయణ టెక్నో పాఠశాలకు చెందిన వీ మహేశ్కుమార్ 7వ ర్యాంకును సాధించగా, కుమరన్ చిల్డ్రన్స్ హోమ్కు చెందిన సిద్దార్థ 8వ ర్యాంకును, రామమూర్తినగరలోని చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన వీ సాత్విక్ 9వ ర్యాంకును సాధించారు. ఇక పశువైద్య విభాగంలో బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విద్యార్థి రుషికేశ్ నాగభూషణ్ గంగూలి టాపర్గా నిలిచారు. వ్యవసాయ కోర్సుల విభాగంలో హెచ్ఏఎల్ పబ్లిక్స్కూల్కు చెందిన అర్జున్ రవిశంకర్ టాపర్గా నిలిచారు. నేచురోపతి, యోగిక్ సైన్సెస్ విభాగంలో కూడా నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విద్యార్థి రుషికేశ్ నాగభూషణ్ గంగూలి టాపర్గా నిలవడం విశేషం.