చిరుధాన్యాల్లోనే పోషకాలు అధికం
ABN , First Publish Date - 2021-06-22T04:33:58+05:30 IST
చిరుధాన్యాల్లోనే షోషకాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని తినేందుకు నేడు ఎందరో ఉత్సాహం చూపుతున్నారని డీడీఎస్ డైరెక్టర్ పీవి. సతీష్ తెలిపారు.
డీడీఎస్ డైరెక్టర్ పీవి. సతీష్
జహీరాబాద్, జూన్ 21: చిరుధాన్యాల్లోనే షోషకాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని తినేందుకు నేడు ఎందరో ఉత్సాహం చూపుతున్నారని డీడీఎస్ డైరెక్టర్ పీవి. సతీష్ తెలిపారు. సోమవారం జహీరాబాద్లోని డీడీఎస్ (డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో కేఫేఎథ్నిక్ (హోటల్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జహీరాబాద్ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా డీడీఎస్ సంస్థ చిరుధాన్యాల సాగువైపు రైతులను ప్రోత్సహించడంతోపాటు, కేఫేఎథ్నిక్ పేరుతో హోటల్ను ఏర్పాటు చేసి చిరుధాన్యాలతో చేసిన వంటలను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. చిరుధాన్యాలతో వండిన వంటకాల్లో పోషకాలు ఎక్కువగా ఉండి శరీరంలో వ్యాధిరుగ్మతలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. నాటి పేదోళ్ల తిండి నేటి పెద్దోళ్లకు ఆయుర్వేదం అని ఆయన అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాలు అంటే ఏమిటనే విషయంపై పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కల్పించామని చెప్పారు. అనంతరం డాక్టర్ శివబాబు, వ్యాపారవేత్త అల్లాడి వంశీకృష్ణ, డీడీఎస్ సంస్థ సభ్యులు జయప్ప, చంద్రమ్మ మాట్లాడారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చిరుధాన్యాలతో వండిన వంటలు తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలను ఎక్కువగా తినాలని సూచించారు. కార్యక్రమంలో డీడీఎస్ ఉద్యోగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.