సోయా డీవోసీ దిగుమతికి అనుమతించాలి
ABN , First Publish Date - 2021-12-08T04:21:52+05:30 IST
రొయ్యల మేత తయారీ దారుల సంఘం విజ్ఞప్తి మేరకు గత ఏడాది సంక్షోభం నుంచి రొయ్యల పరిశ్రమలను రక్షించటానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల సోయా డీవోసీ దిగుమతికి భారత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రొయ్యల మేత తయారీ దారుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు(బీఎమ్మార్) పేర్కొన్నారు.
సోయా బీన్ ధరలను నియంత్రించాలి
కేంద్ర మంత్రి పియూష్ గోయల్కు బీఎమ్మార్ బృందం వినతి
కావలి, డిసెంబరు 7: రొయ్యల మేత తయారీ దారుల సంఘం విజ్ఞప్తి మేరకు గత ఏడాది సంక్షోభం నుంచి రొయ్యల పరిశ్రమలను రక్షించటానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల సోయా డీవోసీ దిగుమతికి భారత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రొయ్యల మేత తయారీ దారుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు(బీఎమ్మార్) పేర్కొన్నారు. అందులో 6.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతి అయ్యిందని, మిగిలిన 5.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి అనుమతులు ఇవ్వాలని బీఎమ్మార్ బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు విన్న వించారు. బీద మస్తాన్ రావు నేతృత్వంలో రొయ్యల మేత తయారీదారుల సంఘం నాయకులు మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి వారి సమస్యలను వివరించారు. స్పెకులేషన్ వ్యాపారం, హోర్డింగ్ కారణంగా సోయా బీన్ గింజల ధరలో వస్తున్న అసహజ పెరుగుదలను నియంత్రించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది సోయా విత్తన ధరలు కిలోకు రూ.50 నుంచి రూ.57 ఉంటుందని ఆక్వాకల్చర్ రంగం ఆశించిందన్నారు. కానీ ప్రస్తుతం సోయా విత్తన ధరలు కిలో రూ.67 నుంచి 72 ఉన్నాయన్నారు. సోయా డీవోసీ యొక్క తీవ్రమైన కొరత కారణంగా అసహజ ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది లాగా ఆక్వా కల్చర్ సంక్షోభానికి దారి తీస్తుందని భయపడుతున్నామన్నారు. వీటిని అధిగమించేందుకు గతంలో మిగిలి ఉన్న సోయా డీవోసీ 5.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి డీజీఎఫ్టీని ఆదేశాంచాలని కోరారు. సోయా ధరలు నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సోయా రైతుల, ఆక్వా రైతుల ప్రయోజనాలను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ గ్రూఫ్ డైరెక్టర్ గుల్రేజ్అలం, ఫెడోరా అధినేత నరసింహారెడ్డి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.