ఒమైక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

ABN , First Publish Date - 2022-01-02T01:53:36+05:30 IST

దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు..

ఒమైక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారంనాడు మరో లేఖ రాసింది. మేక్‌షిఫ్ట్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, హోం ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లను మానిటర్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అన్ని జిల్లాలు, సబ్-డిస్ట్రిక్ట్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్య వసతులపై తిరిగి దృష్టి సారించాలని ఆయన కోరారు.


కాగా, రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ శుక్రవారంనాడు కూడా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.వివిధ ప్రాంతాల్లో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే రాపిడ్ యాంటిజన్ టెస్ట్ బూత్‌లు ఏర్పాటు చేయాలని, మెడికల్, పారామెడికల్ సిబ్బందిని రంగంలోకి దింపాలని, అలాగే హోం టెస్ట్ కిట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ లేఖలో వారు సూచించారు.

Updated Date - 2022-01-02T01:53:36+05:30 IST