వ్యాక్సిన్ మాకొద్దని వాళ్లనడంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-20T02:36:17+05:30 IST

వ్యాక్సిన్ తయారవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని, అలాంటి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కొందరు...

వ్యాక్సిన్ మాకొద్దని వాళ్లనడంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిలో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం, వ్యాక్సిన్‌ వద్దని తిరస్కరించడం అసంతృప్తి కలిగించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని, అలాంటి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కొందరు హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు ముందుకు రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఉపద్రవం ఏ రూపం తీసుకుంటుందో తెలియదని, అందువల్ల వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు రావాలని వీకే పాల్ పిలుపునిచ్చారు.


కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ల వల్ల దుష్ప్రభావాలు, విషమ పరిస్థితులు ఎదుర్కొన్న పరిణామాలు అంతగా లేవని, ఈ రెండు వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని డాక్టర్ పాల్ చెప్పారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ర్పభావాలు కనిపించినా చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందన్న అపోహల నుంచి హెల్త్ కేర్ వర్కర్లు బయటపడాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆయన తెలిపారు.


ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకూ 6.31 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం వరకూ.. టీకా తీసుకున్న వారిలో 580 మందిలో దుష్ప్రభావాలు కనిపించినట్లు పేర్కొంది. అయితే.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యూపీలో ఒకరు, కర్ణాటకలోని బళ్లారిలో ఒకరు మరణించారని.. అయితే వారి మృతికి ఇతర అనారోగ్య సమస్యలే కారణమని తేలినట్లు కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2021-01-20T02:36:17+05:30 IST