కొండ ప్రాంతాలకు డ్రోన్లతో టీకాలు!
ABN , First Publish Date - 2021-06-14T07:51:47+05:30 IST
రవాణా సదుపాయాలు లేని, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు టీకాలను చేరవేయాలంటే అష్టకష్టాలు పడాల్సిందే! మరి దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలకు వ్యాక్సిన్లను ఎలా తీసుకెళ్లాలి? అంటే కేంద్రం ఓ సరికొత్త ఆలోచన...
- టెండర్లు ఆహ్వానించిన కేంద్రం
- ప్రస్తుతం తెలంగాణలో వినియోగం
న్యూఢిల్లీ, జూన్ 13: రవాణా సదుపాయాలు లేని, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు టీకాలను చేరవేయాలంటే అష్టకష్టాలు పడాల్సిందే! మరి దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలకు వ్యాక్సిన్లను ఎలా తీసుకెళ్లాలి? అంటే కేంద్రం ఓ సరికొత్త ఆలోచన చేసింది. డ్రోన్ల ద్వారా టీకాలను చేరవేయాలని నిర్ణయించింది. ఇలా చేరవేయడం సాధ్యమేనని ఐఐటీ కాన్పూర్ అధ్యయనంలో తేలింది. దీంతో కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ ఐసీఎంఆర్ తరఫున డ్రోన్లతో వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. ఈ డ్రోన్లు 35 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. డ్రోన్లు కనీసం 4 కిలోల బరువును మోయగలగాలని, టీకాలను సరఫరా చేసి తిరిగి కమాండ్ స్టేషన్కు చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 22 లోగా బిడ్లు దాఖలు చేయాలని ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రమే టీకాల సరఫరాకు డ్రోన్లను వినియోగిస్తుండడం విశేషం.