మిడతల కట్టడికి కేంద్రం ప్రయత్నాలు
ABN , First Publish Date - 2020-07-12T07:55:31+05:30 IST
ఎడారి మిడతల మూలంగా భారీగా పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీటి కట్టడికి తగిన విధంగా పలు చర్యలు తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి జూలై 9 వరకు...
- పలు రాష్ట్రాల్లో 1.51 లక్షల హెక్టార్లలో నియంత్రణ చర్యలు
న్యూఢిల్లీ, జూలై 11: ఎడారి మిడతల మూలంగా భారీగా పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీటి కట్టడికి తగిన విధంగా పలు చర్యలు తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి జూలై 9 వరకు 1.51 లక్షల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో మిడతల నియంత్రణ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదేశాల మేరకు మిడతల నియంత్రణ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నట్టు శనివారం ఈ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో లోకస్ట్ సర్కిల్ ఆఫీసులు (ఎల్ సీఓ) 1,51,269 హెక్టార్ల విస్తీర్ణంలో నియంత్రణ చర్యలు చేపట్టాయని పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీ్సగఢ్, హర్యానా, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1,31,660 హెక్టార్ల విస్తీర్ణంలో మిడతల నియంత్రణకు చర్యలు తీసుకున్నాయని తెలిపింది. ప్రస్తుతం 60 మిడతల నియంత్రణ బృందాలు పిచికారి యంత్రాలతో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయని, 200కు పైగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్నట్టు పేర్కొంది.