అవసరమైతే నైట్ కర్ఫ్యూలు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

ABN , First Publish Date - 2021-12-12T01:21:57+05:30 IST

దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా ..

అవసరమైతే నైట్ కర్ఫ్యూలు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా పెరుగుతుండంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారంనాడు అప్రమత్తం చేసింది. కోవిడ్ విస్తరిస్తున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు సహా మరిన్ని ఆంక్షలు విధించే విషయమై దృష్టి సారించాలని ఆదేశించింది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.


''దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ కోవిడ్ మహమ్మారిపై పోరాటం కొనసాగించాల్సి ఉంది. జిల్లాల్లో కేసులు, పాజిటివీ రేటు పెరుగుతుంటే స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి. పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచడం, కంటోన్మెంట్ జోన్లుగా పరిగణించి అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు విధించాలి. జనసమూహాలకు అవకాశం ఉన్న చోట్ల పరిమితులు విధించాలి. 3 రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో గత రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉంది. మొత్తంగా ఈ 27 జిల్లాల్లో పరిస్థితిపై ప్రభుత్వ యంత్రాంగం నిశితంగా దృష్టి సారించాల్సి ఉంది'' అని ఆ లేఖలో రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-12T01:21:57+05:30 IST