కేంద్ర, రాష్ట్రాల విధానాలు దేశ అభివృద్ధికి విఘాతాలు
ABN , First Publish Date - 2022-01-17T03:15:17+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు దేశ అభివృద్ధికి పెనువిఘాతం కలిగిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య ఆరోపించారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య
సూళ్లూరుపేట, జనవరి 16 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు దేశ అభివృద్ధికి పెనువిఘాతం కలిగిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్రమోడీ ఆదాని, అంబానీలకు దారాదత్తం చేస్తున్నాడన్నారు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలు దేశ ఆర్ధిక వ్యవస్థను దివాలా దిశగా పరుగుపెట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తోందని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే అన్నారు. నేటి పాలకులు నయా ఉదారవాద విధానాలతో కార్మిక వర్గాన్ని అణిచివేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఉప సంహరించుకోకుంటే జరగబోయే కార్మిక ఉద్యమాలకు ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ సి. సుధాకర్రెడ్డి, సూళ్లూరుపేట, తడ మండలాల కార్యదర్శులు ఓడూరు కృష్ణయ్య, ఏడుమలైరెడ్డి, మనోహర్, లక్ష్మమ్మ, చెంచమ్మ, ఎఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వినోద్కుమార్, నియోజకవర్గ కార్యదర్శి సూర్య, తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక
ఈ సభలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడుగా కె. శ్రీనివాసులు, అధ్యక్షుడుగా కె. రమణయ్య, ఉపాధ్యక్షుడుగా అహ్మద్బాషా, ప్రధాన కార్యదర్శిగా నాగేంద్రబాబు, సహా య కార్యదర్శిగా ఓ కుమార్, కోశాధికారిగా ఎ. రాజాను ఎన్నుకున్నారు.