Sedition Law వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టును గడువు కోరిన కేంద్రం

ABN , First Publish Date - 2022-05-03T21:23:55+05:30 IST

బ్రిటిష్ వలస పాలకుల నాటి దేశద్రోహ చట్టాన్ని (Sedition Law) సవాలు చేస్తూ దాఖలైన పలు..

Sedition Law వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టును గడువు కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలకుల నాటి దేశద్రోహ చట్టాన్ని (Sedition Law) సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తమ స్పందన తెలియజేసేందుకు కొంత గడువు కావాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ విషయమై మే 5వ తేదీన తుది విచారణ మొదలవుతుందని గత ఏప్రిల్ 27న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు సూర్య కాంత్, హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. తుది విచారణను వాయిదా వేయాలని కోరే ఎలాంటి విజ్ఞప్తులను స్వీకరించమని, ఈలోపు తమ సమధానం తెలియజేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అప్లికేషన్‌ను కోర్టుకు సమర్పించింది. అఫిడవిట్ డ్రాఫ్ట్ రెడీ చేశామని, సంబంధిత అథారిటీ నుంచి ధ్రువీకరణ కోసం వేచిచూస్తున్నామని అందులో తెలిపింది.


కాగా, దేశద్రోహం చట్టం పలుమార్లు దుర్వినియోగం అవుతుండటంపై అత్యున్నత న్యాయస్థానం గతం ఏడాది జూలైలో ఆందోళన వ్యక్తం చేసింది. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ, తిలక్ వంటి నేతల వాణిని, ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన చట్ట నిబంధనలను ఎందుకు రద్దు చేయరాదని కేంద్రాన్ని నిలదీసింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా బ్రిటిష్ వలస పాలకుల నాటి చట్టం అవసరం ఉందా అని ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్ 124ఎ (దేశద్రోహం) రాజ్యాంగ బద్ధతను ఎడిటర్ గిల్డ్ ఆప్ ఇండియా, మజీ మేజర్ జనరల్ ఎస్.జీ.వోంబట్కెరె తదితరులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దేశద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన వారిలో  కేంద్ర మాజీ మాజీ మంత్రి అరుణ్ శౌరి, పాత్రికేయులు కిషోర్ చంద్ర వాంఖ్కేమాచ్చా (మణిపూర్), కన్హయలాల్ శుక్లా (ఛత్తీస్‌గఢ్) తదితరులు ఉన్నారు.

Read more