దైవాధీనం
ABN , First Publish Date - 2020-08-28T07:21:13+05:30 IST
జీఎస్టీ పరిహారాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు...
- జీఎస్టీ నష్టాలను ఇప్పుడు పూడ్చలేం
- కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
- కావాలంటే అప్పు ఇప్పిస్తాం తీసుకోండి
- ఆర్బీఐ ద్వారా హేతుబద్ధ వడ్డీ ఒక మార్గం
- ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరణ మరో దారి
- మీకేది కావాలో తేల్చుకుని 7రోజుల్లో చెప్పండి
- రాష్ట్రాలకు కేంద్రం రెండు ప్రత్యామ్నాయాలు
- కొవిడ్ను దైవఘటనగా అభివర్ణించిన నిర్మల
- పన్ను రేట్లు పెంచే ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
- ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం: సిసోడియా
- కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకివ్వాలి
- ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోంది
- ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు
జీఎస్టీ పరిహారాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
- కేంద్రమే రిజర్వు బ్యాంకుతో మాట్లాడి, హేతుబద్ధమైన వడ్డీ రేట్లకు.. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయిన రూ.97 వేల కోట్లను అప్పుగా ఇప్పించడం. ఈ మొత్తాన్ని అయిదు సంవత్సరాల తర్వాత కాంపెన్సేషన్ సెస్ వసూళ్ల నుంచి తిరిగి చెల్లించవచ్చునని నిర్మల చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాల రుణపరిమితిని మరో 0.5 శాతం మేర పెంచుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు.
- ఆర్బీఐతో సంప్రదించి రూ. 2.35 లక్షల కోట్ల జీఎస్టీ నష్టపరిహారాన్ని ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే ఏర్పాటు.
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అసలే కరోనా దెబ్బకు అతలాకుతలమైపోయి.. జీఎస్టీ పరిహారం సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.2.35 లక్షల కోట్ల మేర తగ్గిపోనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడాన్ని ‘దైవ ఘటన’గా నిర్మల అభివర్ణించారు. గురువారం ఇక్కడ ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన జీఎస్టీమండలి 41వ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్ల మేర జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉండగా.. జీఎస్టీ ఆదాయం రూ.65 వేల కోట్లదాకా ఉండబోతోందని కేంద్రం అంచనా వేసింది. అంటే, లోటు అంచనా.. అక్షరాలా రూ.2.35 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ పేర్కొన్న లోటు ఇదే. అందులో రూ.97 వేల కోట్లు మాత్రమే వాస్తంగా జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడే లోటు అని, మిగతా లోటుకు కారణం కరోనాయేనని కేంద్రం చెబుతోంది.