న్యూఢిల్లీ : సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) పరిధి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని 23 జిల్లాలు, మరో జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్లోని 6 జిల్లాలు, నాగాలాండ్లోని 7 జిల్లాలకు ఈ మినహాయింపు లభించింది.
AFSPA 1958 సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమని భావించిన చర్యలను సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వ్యక్తుల మరణానికి దారి తీసే విధంగానైనా చర్యలు చేపట్టడం, వారంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటివాటికి అవకాశం కల్పిస్తుంది.
ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. గత ఏడాది డిసెంబరు 4న నాగాలాండ్లోని మోన్ జిల్లా, ఓటింగ్ గ్రామస్థులను ఉగ్రవాదులుగా భావించి, వారిపై సాయుద దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహోదగ్రులైన గ్రామస్థులు సాయుధ దళాల వాహనాలను తగులబెట్టి, ధ్వంసం చేశారు. ప్రతిస్పందించిన భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరపడంతో మరొక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది.
నాగాలాండ్లో ఈ చట్టాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబరు 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వై పట్టోన్, NPFLP నేత టీఆర్ జెలియాంగ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఇచ్చిన ట్వీట్లో, మంచి నిర్ణయాలు తీసుకునే సత్తాగల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన చర్యను చేపట్టిందని తెలిపారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించిందన్నారు. అనేక దశాబ్దాల అనంతరం ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి