న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ (Petrol and Diesel)లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు రుణం కోసం ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం ప్రకటించిన నిర్ణయం వల్ల దాదాపు 12.9 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని కేంద్రం కోల్పోతుందని అంచనా.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, వస్తు, సేవల పన్ను (GST), వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా వసూలైన సొమ్ము పేదలు, రైతులకు ఆహారం, ఎరువుల కోసం రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఖర్చు చేస్తోంది. ఇటీవల తగ్గించిన ఎక్సయిజ్ సుంకాల వల్ల ఖజానాకు రాబోతున్న నష్టాన్ని అదనపు రుణాల ద్వారా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణ భారం పెరుగుతుండటంతో భారత దేశ బాండ్ మార్కెట్పై ప్రభావం పడుతుంది. గత నెలలో బెంచ్మార్క్ 10 ఇయర్ నోట్స్పై రాబడిలో పెరుగుదల కనిపించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఈ నెలలో వడ్డీ రేట్లను పెంచి మదుపరులను ఆశ్చర్యపరిచింది.
కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోలు, డీజిల్లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు, కోకింగ్ కోల్పై దిగుమతి పన్నును తగ్గించింది. అదేవిధంగా ఎరువులపై రాయితీలను పెంచింది. అంతేకాకుండా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద పేదలకు అందిస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలో రాయితీని పెంచింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తేవాలని ప్రణాళికను రచిస్తుండటాన్ని, ధరల ఒత్తిళ్ళు పెరుగుతుండటాన్ని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదలను మదుపరులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇవి కూడా చదవండి