సీఏఏను సవరించడంపై స్పష్టతనిచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2021-08-04T21:20:31+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మరోసారి సవరించే

సీఏఏను సవరించడంపై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మరోసారి సవరించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది. ఈ చట్టం పరిధిలోకి ఇతర మైనారిటీలను తీసుకురావడం కోసం మరో సవరణ తేవాలనే ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ అబ్దుల్ వహబ్ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. 


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో, కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత అర్హతగలవారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. సీఏఏ ప్రకారం నిబంధనలను రూపొందించడానికి గడువును 2022 జనవరి 9 వరకు పెంచాలని లోక్‌సభ, రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలను కోరినట్లు తెలిపారు. 


సీఏఏను 2019 డిసెంబరు 12న నోటిఫై చేశారు. 2020 జనవరి 10 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింస, వేధింపులు, అణచివేతకు గురైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారశీకులు, క్రైస్తవులు ఈ చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వం పొందవచ్చు. ఈ దేశాల నుంచి వీరు 2014 డిసెంబరు 31నాటికి భారత దేశానికి వచ్చి ఉండాలి.



Updated Date - 2021-08-04T21:20:31+05:30 IST