11 మంది మహిళా సైనికాధికారులకు కేంద్రం శుభవార్త!
ABN , First Publish Date - 2021-11-12T22:14:25+05:30 IST
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు పర్మనెంట్
న్యూఢిల్లీ : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేయడం లేదని ఆరోపించిన 11 మంది షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) మహిళా సైన్యాధికారులకు భారత ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఈ మహిళలకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేస్తామని సుప్రీంకోర్టుకు శుక్రవారం హామీ ఇచ్చింది. అర్హతగలవారికి పర్మనెంట్ కమిషన్ మంజూరు చేయకపోతే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్రం దిగి వచ్చింది. 10 రోజుల్లోగా ఈ అధికారిణులకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
కోర్టును ఆశ్రయించని, వివిధ అర్హతా నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎస్ఎస్సీ మహిళా అధికారులకు మూడు వారాల్లోగా పర్మనెంట్ కమిషన్ను మంజూరు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అక్టోబరులో కూడా సుప్రీంకోర్టు 39 మంది ఎస్ఎస్సీ మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ మంజూరుకు సానుకూలత తెలిపింది. మహిళా ఎస్ఎస్సీ అధికారులకు సంబందించిన అన్ని సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టినందుకు ఆర్మీని అభినందించింది. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పర్మనెంట్ కమిషన్ను మంజూరు చేయలేదని ఆరోపిస్తూ 11 మంది మహిళా అధికారులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న ధర్మాసనం విచారణ జరిపింది.
కొందరు మహిళా అధికారులు పర్మనెంట్ కమిషన్కు అర్హులు కాదని ఆర్మీ ప్రకటించడంతో, దాదాపు 72 మంది ఆగస్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మదింపులో కనీసం 60 శాతం మార్కులు సాధించడంతోపాటు 2020 ఆగస్టు 1న భారత సైన్యం నిర్దేశించిన మెడికల్ క్రైటీరియాకు అనుగుణంగా ఉన్నవారికి, క్రమశిక్షణ, విజిలెన్స్ అనుమతులు పొందినవారికి పర్మనెంట్ కమిషన్ను మంజూరు చేయాలని ఈ ఏడాది మార్చిలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా తమకు అర్హతలు ఉన్నప్పటికీ పర్మనెంట్ కమిషన్ను మంజూరు చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు.