ప్రధాన మంత్రి నిర్భర్‌ యోజన కింద చేయాల్సినవి చాలా ఉన్నాయి

ABN , First Publish Date - 2020-08-02T20:57:23+05:30 IST

ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ యోజన పధకం కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో అధికారుల చొరవను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు.

ప్రధాన మంత్రి నిర్భర్‌ యోజన కింద చేయాల్సినవి చాలా ఉన్నాయి

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ యోజన పధకం కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో అధికారుల చొరవను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు.అయితే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని చెప్పారు. నాబార్డ్‌ తెలంగాణ రీజియన్‌ రాష్ట్రంలో వివిధ పథకాలకు అందిస్తున్న రుణసహాయం పై కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌లో పలువురు ఉన్నతాదికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమపథకాలను అడిగి తెలుసుకున్నారు. హడ్కో అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన ద్వారా మంజూరైన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల యూనిట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా ఈసందర్భంగా హడ్కోఅధికారి సుధాకర్‌బాబు వివరించారు.


అంతకు ముందు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతితో జరిగిన సమావేశంలో నగరంలో గృహనిర్మాణ పధకాలు, గృహాల కేటాయింపు తదితర అంశాలు చర్చించారు. బాపూనగర్‌ స్కూల్‌ భవనం విషయం గురించి కూడా చర్చించారు. ఇక అంబర్‌పేట గౌతులచ్చన్న ఆడి టోరియం నిర్మాణం పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గడిచిన 16వ లోక్‌సభ కాలంలో సికింద్రాబాద్‌పార్లమెంట్‌ నియోజక వర్గ అభివృద్ధి నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలు, ప్రస్తుత ఎంపీ లాడ్‌స గురించి అడిగి తెలుసుకున్నారు.


జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో జరిగిన సమావేశంలో అంబర్‌పేట ఫ్లయ్‌ఓవర్‌ నిర్మాణం గురించి చర్చించి నిర్మాణ పురోగతిని ఆరా తీశారు. అడ్డంకులను తొలగించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-08-02T20:57:23+05:30 IST