Polavaram పై ఏపీకి కేంద్రం షాక్..

ABN , First Publish Date - 2021-07-26T22:45:15+05:30 IST

సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ...

Polavaram పై ఏపీకి కేంద్రం షాక్..

న్యూ ఢిల్లీ/అమరావతి : పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. ప్రాజెక్ట్ హెడ్‌ వర్క్స్‌ డిజైన్లలో జరిగిన మార్పుల వలన హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల నుంచి 7,192 కోట్లకు పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో డిజైన్ల మార్పు కారణంగా పెరిగిన అదనపు వ్యయాన్ని కేంద్రం భరించేది, లేనిది సూటిగా చెప్పకుండా జవాబును దాటవేశారు.! 2014 ఏప్రిల్‌-01 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.


ఆ బాధ్యత ఏపీ సర్కార్‌దే..

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రాజెక్ట్‌ డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవో లేదో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించి ఆమోదించిన మీదటే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసింది. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోంది అని మంత్రి షెకావత్‌ తెలిపారు. సోమవారం నాడు జరిగిన పార్లమెంట్ సమావేశాల అనంతరం విజయసాయి విడుదల చేసిన ప్రకటనలో పై విధంగా పేర్కొన్నారు.

Updated Date - 2021-07-26T22:45:15+05:30 IST