కొవిడ్పై కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి
ABN , First Publish Date - 2021-10-19T08:14:49+05:30 IST
కొవిడ్ నియంత్రణకు సంబంధించి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): కొవిడ్ నియంత్రణకు సంబంధించి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. కరోనా నియంత్రణ, చికిత్స, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజే సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ కొవిడ్ టెస్టులు, ప్రభుత్వ ఆస్పత్రులలో పీడియాట్రిక్ డాక్టర్ల సంఖ్య, ఇతర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు.
రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఏజీ తెలిపారు. పండుగలు, ఇతర కార్యక్రమాల వద్ద మాస్కు ధరించాలన్న నిబంధనల ఎక్కడా అమలు కావడం లేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కొవిడ్ నిబంధనలు అమలు కావడం లేదని మరొక పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కేంద్రం మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.