వీధి వ్యాపారులకు కేంద్రం రుణ సహాయం.. 12 నెలల్లో తిరిగి చెల్లించేలా
ABN , First Publish Date - 2020-07-15T16:24:26+05:30 IST
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత నిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణ సహాయం అందజేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
నిజామాబాద్ అర్బన్: ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత నిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణ సహాయం అందజేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నుంచి చిరు వ్యాపారులను కాపాడడానికి పెట్టుబడి సహాయం కోసం కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. రుణసహాయం పొందిన లబ్ధిదారులు ఏడాది పాటు 12 నెలల వాయిదాల్లో డబ్బులు తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి 7 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే క్యాష్బ్యాక్ సౌకర్యం కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో 7434 మంది వీధి విక్రయదారులను గుర్తించామని తెలిపారు. దరఖాస్తుదారులు తమ ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్, నగర పాలక సంస్థ నుంచి జారీచేసిన స్ర్టీట్ వెండర్ ఐడీ కార్డు తీసుకొని మెప్మా ఆర్పీల ద్వారా నగర పాలక సంస్థ లేదా మీ సేవల ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చిరు వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళ వారం చిరు, వీధి వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. నగదు రహిత లావాదేవీలకు వీలుగా ఫోన్ ద్వారా యూ పీఐ, క్యూఆర్ కోడ్లను ఫోన్పే ద్వారా అందజేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. డిజిటల్ లావాదేవీలు జరపడం పట్ల ప్రతి నెలా రూ.వంద వరకు ప్రొత్సాహకం లభించనున్నట్టు తెలిపారు. వ్యాపా రులు తమ ఆధార్కార్డును తాము వినియోగించే ఫోన్కు మీ సేవ కేంద్రాల్లో అనుసంధానం చేసుకోవాలని, వారికి మాత్రమే ఆత్మనిర్బర్ నిధి పథకం కింద లోన్ వీలవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 645మంది వీధి వ్యాపారులను గుర్తించినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, టౌన్ప్లానింగ్ అధికారి రమేష్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.