విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచాలన్న కేంద్రం!

ABN , First Publish Date - 2021-10-13T00:21:50+05:30 IST

విద్యుదుత్పత్తి ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోల్

విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచాలన్న కేంద్రం!

న్యూఢిల్లీ : విద్యుదుత్పత్తి ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దుర్గా పూజల సమయంలో రోజుకు 1.55-1.6 మిలియన్ టన్నులు సరఫరా చేయాలని, అక్టోబరు 20 తర్వాత రోజుకు 1.7 మిలియన్ టన్నులు సరఫరా చేయాలని తెలిపింది. పండుగల సమయం ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలు బొగ్గు కొరతతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


మన దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 69 శాతం విద్యుత్తు బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లలో ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాంట్లకు సోమవారం 1.615 మిలియన్ టన్నుల బొగ్గును కోల్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేసింది. కోల్ ఇండియా సరఫరా చేసే బొగ్గులో 80 శాతం బొగ్గు విద్యుత్తు రంగానికి వెళ్తుంది. విద్యుదుత్పత్తికి తగినంత బొగ్గు విద్యుత్తు ప్లాంట్లకు అందుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిల్వ ఉన్న బొగ్గులో ఖర్చయినదానికి తగినట్లుగా బొగ్గును తీసుకోవడం లేదని తెలిపాయి. చాలా ప్లాంట్లు ఈ రిస్క్ చేశాయని పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు  నవంబరు 1 నుంచి తగిన స్థాయిలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ ప్లాంట్లు తమకు కేటాయించిన సరఫరాలను తీసుకోలేదని, అవసరం లేనపుడు సొమ్మును ఇప్పుడే ఎందుకు వృథా చేయాలని అనుకున్నాయని తెలిపాయి. డిస్పాచ్ రేటును మెయింటెయిన్ చేస్తే, బొగ్గు నిల్వలు తగిన స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నాయి. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీ వర్షాల పరిస్థితుల్లో కూడా కోల్ ఇండియా లిమిటెడ్ 126 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు ఈ వర్గాలు తెలిపాయి. అంటే బొగ్గు ఉత్పత్తి ఇయర్-ఆన్-ఇయర్ 9.6 శాతం వృద్ధి చెందిందని తెలిపాయి. 


Updated Date - 2021-10-13T00:21:50+05:30 IST