Central Government: గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞల సడలింపు

ABN , First Publish Date - 2022-05-17T20:37:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వం (Central Government) గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో

Central Government: గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞల సడలింపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం (Central Government) గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపునిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 


ఈజిప్టునకు వెళ్ళే గోధుమల కన్‌సైన్‌మెంట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్‌సైన్‌మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు (Egypt) ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు. 


ఇతర దేశాల ఆహార భద్రత (Food Security) అవసరాలను తీర్చేందుకు ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఆ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయవచ్చునని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. అదేవిధంగా రద్దు చేయడానికి వీలుకానటువంటి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈ నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినట్లయితే, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించి, ఎగుమతి చేయవచ్చునని తెలిపింది. 


గోధుమల ఎగుమతిపై భారత దేశం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం వీటి ధరలు 6 శాతం పెరిగాయి. మన దేశంలో 4 నుంచి 8 శాతం వరకు తగ్గిపోయాయి. రాజస్థాన్‌లో క్వింటాలు గోధుమల ధర రూ.200 నుంచి రూ.250 వరకు తగ్గింది. పంజాబ్‌లో రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింది. ఉత్తర ప్రదేశ్‌లో రూ.100 వరకు తగ్గింది. 


అన్ని రకాల గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విదించిన సంగతి తెలిసిందే. అత్యధిక ప్రొటీన్ ఉండే గోధుమలు, సాధారణ సాఫ్ట్ బ్రెడ్ రకాల గోధుమల ఎగుమతులను కూడా నిషేధించింది. 


Updated Date - 2022-05-17T20:37:05+05:30 IST