రాజ్యసభ వేదికగా విజయసాయికి హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి

ABN , First Publish Date - 2020-09-15T23:35:48+05:30 IST

దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ

రాజ్యసభ వేదికగా విజయసాయికి హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి

  • త్వరలోనే పోలవరం బకాయిల చెల్లింపు
  • రాజ్యసభలో వైసీపీ ఎంపీకి ఆర్థిక మంత్రి హామీ


న్యూఢిల్లీ/అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇవాళ రాజ్యసభ జీరో అవర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.


ఏపీ లక్ష్యమిదే..

పోలవరం సాగునీటి ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటిది. దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే సమకూర్చవలసి ఉంటుందని విజయసాయి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోంది. ఆ విధంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,805 కోట్ల రూపాయల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సైతం ధృవీకరిస్తూ ఆడిట్‌ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని విజయసాయి రెడ్డి చెప్పారు.


జల శక్తి మంత్రికి విజ్ఞప్తి 

రాష్ట్ర విభజన, ప్రస్తుతం కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వివరిస్తూ రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జల శక్తి మంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-09-15T23:35:48+05:30 IST