ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T09:39:30+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం

  • ఇప్పటికీ ఓపీ సేవలే అందిస్తున్నారు..
  • పూర్తి సౌకర్యాలు కల్పించాలి
  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బాధ్యత లేదా?: హరీశ్‌ రావు


యాదాద్రి, మే 20 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎయిమ్స్‌ను సందర్శించారు. ఆస్పత్రి పతీరును పరిశీలించారు. అనంతరం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డీపీఎ్‌సయూ, ఎస్‌ఎన్‌సీయూ వార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు మూడేళ్లు అయిందని, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 2018 నుంచి ఓపీ సేవలకే పరిమితమైందని, ఒక్క ఆపరేషన్‌ థియేటర్‌, బ్లడ్‌బ్యాంక్‌ లేవని, ఇన్‌పేషెంట్లు కూడా లేరని, ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న 212 మంది విద్యార్థులు ఎలా చదువుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎయిమ్స్‌లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని, ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అనంతరం యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో ఆస్పత్రుల పనితీరుపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పెరిగిందని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా పెరిగాయన్నారు. భువనగిరిలో రూ.కోటితో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, మూడు బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-05-21T09:39:30+05:30 IST