శతజయంతి ముస్తాబు
ABN , First Publish Date - 2022-05-25T06:38:31+05:30 IST
శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని తెలుగువారి ఆరాధ్యుడైన నందమూరి తారక రామారావు విగ్రహం తిరుపతిలో ముస్తాబవుతోంది.
తిరుపతి, మే 24 (ఆంధ్రజ్యోతి): శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని తెలుగువారి ఆరాధ్యుడైన నందమూరి తారక రామారావు విగ్రహం తిరుపతిలో ముస్తాబవుతోంది. ఈనెల 28వ తేదీన తెలుగు సినీ సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి. అదే రోజున తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంత్యుత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సన్నద్ధమవుతున్నారు. ఆ క్రమంలో నగరంలోని టౌన్ క్లబ్ కూడలిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం కూడా ముస్తాబవుతోంది. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, ఎన్టీఆర్ రాజు కుమారుడైన టీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మంగళవారం విగ్రహాన్ని శుద్ధి చేయించారు. అనంతరం కొత్తగా రంగులు వేయించే పనిలో పడ్డారు. సరికొత్త పసుపు రంగులో మెరిసిపోతున్న ఎన్టీఆర్ విగ్రహంతో టౌన్ క్లబ్ కూడలికి కొత్త కళ వచ్చినట్టయింది.