Telanganaను చూసి ఓర్వలేని కేంద్రం: మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-05-28T00:05:24+05:30 IST

70 ఏళ్లలో చేయనిది.. 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Telanganaను చూసి ఓర్వలేని కేంద్రం: మంత్రి హరీశ్‌రావు

మెదక్: 70 ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్ చేయనిది.. 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా మనోహరబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి.. లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. గీతారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు అని చెప్పారు. కేసీఆర్ వచ్చాక తాగు, సాగు నీళ్ల కొరత లేదు, కరెంట్ కొరత లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతారు. 70 ఏళ్లల్లో రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ వచ్చి రాష్ట్రం గురించి ఒక్క మాట అయినా చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.. అని నిలదీశారు.


తెలంగాణను చూసి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు  అమిత్ షా, మోదీ వచ్చారు... పేదల కోసం,  రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మాట అయినా చెప్పలేదు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాముు పాటు పడతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొననని అన్నది. కక్ష కట్టి  మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూసిందని మండిపడ్డారు.రాహుల్ గాంధీ మీ డిక్లరేషన్ ముందు ఛత్తీస్‌గడ్‌లో అమలు చేయి. అక్కడ ఎందుకు వడ్లు కొనడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కాలి పోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు గుర్తుకు వస్తాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-28T00:05:24+05:30 IST