సర్కారు కాలువపై భూస్వామి పెత్తనం

ABN , First Publish Date - 2021-05-17T05:49:07+05:30 IST

కాదేది కబ్జాకు అనర్హం.. అన్నట్టు సాగునీటి కాలువనే కబ్జా చేశాడు ఓ భూస్వామి. చిన్న రైతుల భూములకు నీరందకుండా ఏకంగా కాలువకు అడ్డంగా చెక్‌డ్యాం నిర్మించాడు.

సర్కారు కాలువపై భూస్వామి పెత్తనం

తన భూమికి నీరందిన  తర్వాతే ఇతరులకు

కాలువ వద్ద బావి తవ్వి నీటి మళ్లింపు


మెదక్‌ రూరల్‌, మే 16: కాదేది కబ్జాకు అనర్హం.. అన్నట్టు సాగునీటి కాలువనే కబ్జా చేశాడు ఓ భూస్వామి. చిన్న రైతుల భూములకు నీరందకుండా ఏకంగా కాలువకు అడ్డంగా చెక్‌డ్యాం నిర్మించాడు. తన భూమిలో బావిని తవ్వించి కాలువ నుంచి నీటిని మళ్తిస్తున్నాడు. దీంతో కాలువకు కిందభాగంలో ఉన్న భూములకు నీరందడంలేదు. పలుకుబడి ఉండడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదని, తమ భూములు బీడువారుతున్నా పట్టించుకోకపోవడంలేదని చిన్నరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కబ్జాపర్వం మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామంలో జరుగుతున్నది. పూరూర్‌లో ఎలాంటి చెరువులు లేవు. ఘణపురం ప్రాజెక్టు కాలువల ద్వారానే అందించే నీటి ఆధారంగా పంటలు సాగుచేస్తారు. గ్రామంలో కొంతభాగానికి ఆనల్ల కాలువ ద్వారా నీరందుతుంది. ఈ కాలువ ఓ పెద్ద భూస్వామి భూమి పక్కనుంచి వెళ్తుంది. దీంతో ఆ భూస్వామి కాలువపై పెత్తనం చెలాయిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా కాలువ మధ్యలో చిన్నపాటి చెక్‌డ్యాంను నిర్మించుకున్నాడు. రైతులు అభ్యంతరం చెప్పగా చెక్‌డ్యాం పొర్లితే నీరంతా కిందికే వస్తుందికదా.. అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం మరో అడుగు ముందుకువేసి తన భూమిలో పెద్ద బావిని తవ్వి, కాలువ నుంచి నీరు బావిలోకి మళ్లిస్తున్నాడు. దీంతో కాలువ నీళ్లు తమ భూముల్లోకి రావడంలేదని గ్రామానికి చెందిన పద్మారావు, జానయ్య, దేవయ్య తదితరులు వాపోతేన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోడంలేదని వారు ఆరోపించారు. కాలువ నీళ్లు రాకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు. 

Updated Date - 2021-05-17T05:49:07+05:30 IST