జగనన్న కాలనీ ఇళ్లకు అందని సిమెంట్
ABN , First Publish Date - 2022-05-17T06:41:24+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్ సరఫరా కాకపోవడంతో పలుగ్రామాల్లో లబ్ధిదారులు పనులు ఆపేశారు.
రెండు నెలలుగా సరఫరా కాలేదంటున్న లబ్ధిదారులు
పునాదుల్లోనే పనులు ఆపేసిన వైనం
మాకవరపాలెం, మే 16: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్ సరఫరా కాకపోవడంతో పలుగ్రామాల్లో లబ్ధిదారులు పనులు ఆపేశారు. పైడిపాల, పెద్దిపాలెం, చామంతిపురం, తూటిపాల, పాపయ్యపాలెం, జి.గంగవరం, తదితర గ్రామాల్లో సుమారు 300 ఇళ్లు రెండు నెలల నుంచి పునాదుల గోతులకే పరిమితం అయ్యాయి. పునాదులు తవ్వితే మొదటి విడతగా 40 బస్తాల సిమెంటు, రూ.15 వేల నగదు వస్తుందని హౌసింగ్ అధికారులు చెప్పడంతో రెండు నెలల క్రితం పునాదుల గోతులు తీశామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంతవరకు సిమెంటు, నగదు అందకపోకవడంతో పనులు చేపట్టలేదని, దీంతో అకాల వర్షాలతో పునాదుల్లోకి మట్టి కారిపోతున్నదని వాపోతున్నారు. ఈ సమస్యను హౌసింగ్ జేఈ రామలింగస్వామినాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. మండలంలోని లబ్ధిదారులకు 3,200 బస్తాల సిమెంట్ రావాల్సి వుందని, వారం రోజుల్లో సిమెంట్ వచ్చే అవకాశం వుందని చెప్పారు.